ఒకరు కేంద్రంలో యూనియన్ మినిష్టర్. పనులు కానీయ్యడు. ఇంకొకరు ప్రధాన ప్రతిపక్షం.. అప్పటి దాకా పదేళ్లపాటు పాలించి.. మళ్లీ ఓ పది పదిహేనేళ్లు పాలించేందుకు వ్యూహ రచన చేస్తున్న యువరాజు. మరొకరు సహాయ నిరాకరణ ఎదుర్కొ0టూ.. రోట్లో తలపెట్టి రోకటి పోటుకు గురవుతున్న సీఎం. ఈ ముగ్గురి మధ్య.. ఈ మూడు పార్టీల మధ్య తెలంగాణ ఆగమవుతోంది.
మెట్రోపై ఈ మూడు పార్టీలు మూడు ముక్కలాట ఆడుతున్నాయి. మొదటి దశ పెండింగ్ పనులు సాగనివ్వకుండా.. సర్కార్ పెట్టుకున్న లోన్ను ఆపేసింది కేంద్రం. ఆ లోన్ అమౌంట్ రూ. 13, 600 కోట్లు ఇవాళే తమ ఖాతాలో పడాల్సి ఉండగా.. పడకపోయే సరికి.. కయ్యున ఒంటికాలిపై లేచాడు సీఎం రేవంత్రెడ్డి. ఇవాళ ప్రెస్మీట్ పెట్టి మళ్లీ కిషన్రెడ్డిని చెడామడా తిట్టాడు. కేటీఆర్ వద్దంటున్నాడు.. కిషన్రెడ్డి అడ్డుకుంటున్నాడు.. అని తీవ్ర ఆరోపణలు చేశాడు.
కేసీఆర్ లెక్క నిన్ను రండా.. అని తిట్టిన్నా.. మర్యాద ఇస్తున్నా.. ఇవాళ ఐదు గంటల వరకు పైసలు వేస్తావా? లేదా? నీ సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చాడు. సీఎం రేవంత్ బాధంతా .. ఆ లోన్ అమౌంట్ తక్కువ వడ్డీకి వస్తుందని. ఇది మిస్ అయితే.. కొంచె ఎక్కువ మిత్తీకి తీసుకోవాల్సి వస్తుందని. అయితే, సీఎం ప్రెస్మీట్ ద్వారా హైదరాబాద్ జనాలకు తెలిసిందేమిటంటే.. ఈ మూడు పార్టీల వల్ల మెట్రోపై నీలినీడలు అలుముకున్నాయని. సీఎం రేవంత్ మాట మోడీ వినడు. కిషన్రెడ్డిని ఎంత బెదిరించినా.. అతను మరింత మొండికేసి.. రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని ఆటంకాలు సృష్టించి రేవంత్పై ప్రతీకారం తీర్చుకుంటాడు.
రేవంత్ అన్నట్టుగా.. కేటీఆర్, కిషన్రెడ్డిల మధ్య లోపాయికారి ఒప్పందాలు, భవిష్యత్తులో పార్టీల పొత్తుల నేపథ్యం.. ఇద్దరిదీ ఒకే మాటగా ఉంటే.. సర్కార్ను ఇరుకున పెట్టి.. బద్నాం చేసి.. అయ్యే పనులు కాకుండా అడ్డుకుని, నిధులు రాకుండా చక్రం తిప్పి.. కాంగ్రెస్ మార్క్ లేకుండా చేసి.. అది పూర్తిగా విఫలమైందని జనం అనుకునేలా చేసి.. ! ఇవీ జరిగే రాజకీయాలు. ఇదే జరిగితే రేవంత్ చేసేది ఒంటరిపోరు. ఆ ఒంటరిపోరులో ఫలితాల కన్నా.. పరాభవాలే ఉంటాయి. సమస్య పరిష్కారాల కన్నా.. చీత్కారాలే ఉంటాయి.
జనం సంక్షేమం కన్నా.. రాజకీయంగా పంతం సాధించడమే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతిమంగా జనం నష్టపోతారు. ఆ మూడు ముక్కల ఆటలో తెలంగాణ నష్టపోతున్నది. ఒక్క హైదరాబాద్ మెట్రోనే కాదు.. సంక్షేమం అంతటిపైనా ఈ ప్రభావం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా సర్కార్ అనుకున్నది సాధించలేకపోతుంది. చేయలేకపోతుంది. ఇవే కావాలి. ఆ రెండు పార్టీలకు. జనం గోడు పట్టదు. అధికార పక్షం ఎటుపోతే మాకేంటీ? అనుకుంటాయి ప్రతిపక్షంలోకి రాగానే. అందులో జనం ఎటుపోతే మాకేందీ? అనుకుంటాయి. ఇప్పుడు బీఆరెస్ పాత్ర అదే. దీనికి బీజేపీ వంత పాడుతోంది. మధ్యలో కాంగ్రెస్ గిలగిలా కొట్టుకుంటోంది.