Ambati Rayudu- Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్, ప్రస్తుత కామెంటేటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అంబటి రాయుడు తన ఐపిఎల్ కెరీర్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. 2023 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించిన అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు.
అయితే అంబటి రాయుడు పేరు చెబితే ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అభిమానులకు ఎక్కడో కాలుతుంది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. అంబటి రాయుడు తనకు వీలు కుదిరినప్పుడల్లా ఆర్సీబీని.. ఆర్సిబి అభిమానులకు చురకలు పెడుతూ ఉంటాడు. ఆర్సిబి గెలవాలని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. తాను కామెంటేటర్ అనే విషయాన్ని మర్చిపోయి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడుతుంటాడు.
తరచూ ధోని నామస్మరణలో మునిగిపోతాడు. జట్టుతో సంబంధం లేకుండా ధోని జపంతోనే కామెంట్రీ మొత్తాన్ని నడిపిస్తుంటాడని నెటిజెన్లు అతనిపై మీమ్స్, ట్రోల్స్ తో టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని చవిచూసింది. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న అంబటి రాయుడు, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో ధోని 16 ఓవర్ చివరిలో బ్యాటింగ్ కి దిగే సమయంలో గ్యాలరీ మొత్తం “ధోని ధోని” అంటూ మర్మోగింది.
ఆ సమయంలో సిద్దు మాట్లాడుతూ.. “ధోని మెట్లపై నుండి వేగంగా దిగుతున్నాడు. అతడిలో ఉన్న కసి ఆ దూకుడుగా దిగడంలోనే కనిపిస్తుంది” అని అన్నాడు. దీంతో అంబటి రాయుడు వెంటనే.. ” ధోని బ్యాట్ తో కాదు.. ఖడ్గంతో దిగుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు ఊచకోతే. ధోని క్రికెట్ ఆడడానికి కాదు.. యుద్ధానికి వస్తున్నట్లుగా ఉంది ” అని అన్నాడు. దీంతో అంబటి రాయుడు.. ఆర్సిబి పై సెటైరికల్ గా మాట్లాడినట్లుగానే ధోనీపై కూడా సెటైరికల్ గా మాట్లాడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో కొంతమంది ధోనీనే అంటావా అంటూ అంబటి రాయుడు పై మండిపడ్డారు. దీనిపై స్పందించిన అంబటి రాయుడు.. ” నేనెప్పుడూ ధోనీకి అభిమానినే. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా పరవాలేదు. దానివల్ల ఒక్క శాతం కూడా ఒరిగేది ఏం ఉండదు. నన్ను చేసేది ఏం ఉండదు. కాబట్టి పెయిడ్ పిఆర్ పై డబ్బులు ఖర్చు పెట్టడం మానేయండి. ఆ డబ్బులను ఏదైనా చారిటీకి డొనేట్ చేయండి. దానివల్ల ఎంతోమంది పేదలు బాగుపడతారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా తన కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు అంబటి రాయుడు.
అయితే ఈ వ్యాఖ్యల వల్లే రాయుడికి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఐపీఎల్ లో అంబటి రాయుడు కామెంట్రీ చేయకుండా అతనిపై వేటు వేసేందుకు చర్యలు తీసుకోనున్నారట. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం అడుగులు వేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని జట్లను కించపరిచేలా, మరో జట్టును పొగుడుతూ అంబటి రాయుడు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందినట్లు చెబుతున్నారు. కామెంట్రీ చేసే ఓ వ్యక్తి ఇలా వ్యవహరించడం పట్ల ఐపీఎల్ యాజమాన్యం చాలా సీరియస్ గా ఉందని చెబుతున్నారు. అందుకే అతడు ఇకపై కామెంట్రీ చేయకుండా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు