Hospital Cracks: స్వేచ్ఛ బ్యూరో: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ పట్టణంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇంకా భవనం అందుబాటులోకి రాకముందే గోడలు, పిల్లర్లకు భారీగా పగుళ్లు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ భవనం నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి కట్టినట్లు స్పష్టమవుతోంది.
ప్రాంతీయ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణంలో అత్యంత నాసిరకం ఇసుక, తక్కువ నాణ్యత గల సిమెంట్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. పునాదులు, నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే భవనం అంతటా పగుళ్లకు దారితీశాయని ప్రజలు భావిస్తున్నారు. దీనికి తోడు భవనానికి అమర్చిన కిటికీలు, వాటి అద్దాలు ఇప్పటికే ధ్వంసమై ఊడిపోతున్నాయి. సరైన నాణ్యత లేని ఫిట్టింగ్స్ వాడటం వల్లే ఇవి విరిగిపోయినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
Also read: ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !
రూ. కోట్ల ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం కావడంపై అయిజ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని ప్రారంభించక ముందే భవనం ఇంతలా దెబ్బతింటే, రేపు వందలాది మంది రోగులు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైద్య సేవలు అందాల్సిన వేళ, ఆసుపత్రి భవనమే ప్రమాదకరంగా మారడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Also read: ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారా?.. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ రిపోర్ట్..!