Betting Apps Telangana| దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ దందా జోరుగా సాగుతోంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ రాష్ట్రంలో 2017 నుంచే నిషేధం ఉన్నా వీటిని నియంత్రించడం అధికారులకు కష్టతరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యాప్స్ బారిన పడి భారీగా నష్టపోయిన బాధితులు భారీ సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా యువత అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
అయితే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహణ విదేశాల నుంచి జరుగుతోంది. వీటి నిర్వహకులు విదేశాల్లో కూర్చొని యధేచ్ఛగా తమ దందాని కొనసాగిస్తున్నారు. దీని వల్ల వీటిపై నిషేధం ఉన్నా ఏ అడ్డూ లేకుండా వీటిని రాష్ట్రంలో చాలా మంది వినియోగిస్తున్నారు. ఇటీవలే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బెట్టింగ్ యాప్స్ పై విచారణ తీవ్రం చేశారు. ఈ క్రమంలో దుబాయ్ లో, ఫిలిప్పీన్స్ లో స్థిరపడిన కొందరు భారతీయులు ఈ బెట్టింగ్ యాప్స్ని అక్కడి నుంచే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ దేశాల్లో బెట్టింగ్ యాప్స్ నిషేధం లేకపోవడంతో ఈ సైబర్ క్రిమినల్స్ ఏ అడ్డూ లేకుండా అమాయలకులను దోచుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన డిసిపి డి కవిత మాట్లాడుతూ.. “లోకల్ గా పేరున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలోచితంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రొమోట్ చేస్తున్నారు. అందుకే యువత ఈజీగా వీరి మాయలో పడి భారీ నష్టపోతున్నారు.” అని చెప్పారు. సైబరాబాద్ పోలీసులు ఇటీవలే యూట్యూబర్ హర్షసాయికి వ్యతిరేకంగా ఒక కేసు రిజిస్టర్ చేసింది. అతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వినియోగించి ఒక యువకుడు లక్షల్లో నష్టపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిన విష్ణు ప్రియ, రితూ చౌదరి, టేస్టీ తేజా, కిరణ్ గౌడ్, కూడా ఈ బెట్టిగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నందుకు వీరిని పోలీసులు ఇటీవల ప్రశ్నించారు.
విదేశాల్లో ఉన్న బెట్టింగ్ యాప్స్ నిర్వహకులపై చర్యల తీసకునేందుకు అంతర్జాతీయ చట్టాలు అడ్డంకిగా మారాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇతర దేశాల ప్రభుత్వాల సహకారం అవసరమని ఈ దిశగా కృషి చేస్తున్నామని ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఈ బెట్టింగ్ యాప్స్ను అడ్డకునేందుకు చర్యలు చేపట్టింది. అందుకే జనవరి 2025 నుంచి ఇప్పటివరకు మొత్తం 133 యాప్స్ ని జియో ఫెన్సింగ్ ఆధారంగా బ్లాక్ చేసింది. దీనికి తోడు ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి 385 కేసులు నమోదయ్యాయని.. ఈ కేసుల పరిష్కారం కోసం కఠిన చర్యలు తీసుకున్నామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ఈ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా సమాచారం లేదా ఫిర్యాదులు చేయడానికి 8712672222 నెంబర్ కు వాట్సాప్ చేయగలరు.
ఐపిఎల్ సమయంలో వందల సంఖ్యలో పుట్టుకొస్తున్న బెట్టింగ్ యాప్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో బెట్టింగ్ యాప్స్, సైట్స్ వందలాదిగా పెరుగుతున్నాయి. ఈ యాప్స్ యువతను ఆకర్షించి, అప్పుల్లో ముంచి వేస్తున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఈ యాప్స్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఫాంటసీ లీగ్ పేరుతో డ్రీమ్11, మై11సర్కిల్ వంటి యాప్స్ కొన్ని రాష్ట్రాల్లో అనుమతించబడినప్పటికీ, పరిమ్యాచ్, బెట్వే, 1ఎక్స్బెట్ వంటి ఇల్లీగల్ యాప్స్ నేరుగా బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ యాప్స్లు యూజర్ల డేటాను దొంగిలించి, సైబర్ ఫ్రాడ్కు దారితీస్తున్నాయి.
ముందుగా చిన్న మొత్తాలతో ప్రారంభించి, తర్వాత పెద్ద మొత్తాలను డిపాజిట్ చేయమని ఒత్తిడి చేస్తాయి. చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కానీ పరువు పోతుందని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఆఫ్లైన్లో కూడా బెట్టింగ్ ముఠాలు ఐపీఎల్ సమయంలో అభిమానులను దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ వ్యాపారం రూ.లక్షల కోట్ల వరకు చేరుకుందని అంచనా.
బెట్టింగ్ అక్రమం కాబట్టి, దానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆటను ఆస్వాదించడం వరకు ఓకే, కానీ బెట్టింగ్ వేయడం తప్పు. హానికరమైన బెట్టింగ్ యాప్స్ తో చాలా మంది జీవితాలు నాశనమయ్యాయని.. వీటికి దూరంగా ఉండాలని సీనియర్ ఐపిఎస్ అధికారి, టిజి ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ స్వార్థ: కోసం వీటిని ప్రమోట్ చేయడం ఆపాలని.. అమాయక యువత ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి రాత్రికి రాత్రి లక్షలు సంపాదించ వచ్చునని భ్రమిస్తున్నారని ఆయన అన్నారు.