GHMC: స్వేచ్ఛ బ్యూరో: అసలే వర్షాకాలం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వాన దంచి కొడితే ప్రజలకు తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే సిటీలోని పలు మెయిన్ రోడ్లు, కాలనీరోడ్లలో స్ట్రీట్ లైట్లు సక్రమంగా వెలగక వాహనదారులు, పాదచారులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. అసలే వర్షాకాలం సాయంత్రం తర్వాత వర్షం దంచి కొడితే ఇప్పటి వరకున్న ఇబ్బందులు మరింత రెట్టింపయ్యే పరిస్థితులు దాపురించాయి. జీహెచ్ఎంసీలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, పెరిగిన కోర్ అర్బన్ రీజియన్ ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించకముందు జీహెచ్ఎంసీ సిటీ పరిధిలోనున్న స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) కు అప్పగించారు.
అంతకు ముందు సిటీలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను 53 ప్యాకేజీలుగా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టర్లు సక్రమంగా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించకపోవటంతో నిర్వహణలో పారదర్శకత, మరమ్మతులు వేగంగా జరిగే అవకాశముంటుందని భావించిన జీహెచ్ఎంసీ ఈ నిర్వహణ బాధ్యతలకు కాంట్రాక్టు సిస్టమ్ కు ఫుల్ స్టాప్ పెట్టి, ఈఈఎస్ఎల్ కు అప్పగించింది. కానీ ఈఈఎస్ఎల్ నిర్వహణ బాధ్యతలు మరింత అస్తవ్యస్తంగా తయారు కావటంతో గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో బాధ్యతల నుంచి ఈఈఎస్ఎల్ ను తప్పించి, ఆ స్థానంలో ఢిల్లీ మహానగరం, ఔటర్ రింగ్ రోడ్డు లైట్ల నిర్వహణ తరహాలో పేరుగాంచిన ఇంటర్నేషనల్ సంస్థలకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావించింది. అపుడు జీహెచ్ఎంసీ పరిధిలోనున్న దాదాపు 5 లక్షల పై చిలుకు స్ట్రీట్ లైట్ల నిర్వహణకు ఫిలిప్స్, క్రాంప్టన్ గ్రీవ్స్ వంటి సంస్థల నుంచి జీహెచ్ఎంసీ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) లను కూడా ఆహ్వానించింది.
ఈఓఐలను సర్కారుకు పంపించి ఆమోదం తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీకి అంతలోనే చుక్కెదురైంది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ లైట్లనే గాక, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల్లోని స్ట్రీట్ లైట్లతో కలిపి టెండర్లు ఆహ్వానించాలని సర్కారు సూచింది. ఆ తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించినా, కోర్ అర్బన్ రీజియన్ లో సుమారు 7 లక్షల 65 వేల పై చిలుకు కు పెరిగిన స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీయే నిర్వర్తించి, మిగిలిన రెండు కార్పొరేషన్ల పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఆ రెండు సీఎంసీ, ఎంఎంసీల నుంచి వసూలు చేసుకోవాలని సర్కారు సూచించింది.
Also read: Mining Department: గనుల శాఖలో ఐటీ విభాగం జోరుగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు..!
ఔటర్ రింగ్ రోడ్డు, ఢిల్లీ మహానగరం తరహాలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను పేరుగాంచిన సంస్థలకు అప్పగించాలని, వెలగని స్ట్రీట్ లైట్లకు కరెంటు బిల్లులు రాకుండా స్ట్రీట్ లైట్ వారీగా, స్ట్రెచ్ వారీగా నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మూడు నెలలు గడుస్తున్నా, నేటికీ స్ట్రీట్ లైట్ల నిర్వహణకు టెండర్లే గతి లేవు. టెండర్లను ఖరారు చేసి బాధ్యతలను అప్పగించేందుకు జీహెచ్ఎంసీలో ఇంజనీర్ల కొరతను సాకుగా చూపుతున్న అధికారులు ఈ విషయంలో మరింత సమయం తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో ఈ వర్షా కాలం వాహనదారులకు, పాదచారులకు తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
స్ట్రీట్ లైట్లకు నిర్వహణకు సంబంధించి ఈఈఎస్ఎల్ అగ్రిమెంట్ ముగిసిన తర్వాత మరో మూడు నెలల పాటు ఆ సంస్థకే బాధ్యతలను అప్పగించినా, సదరు సంస్థ మరమ్మతులకు కావల్సిన సామాగ్రిలో కనీసం బఫర్ కోటా మెయింటేన్ చేయకపోవటంతో పాటు సిబ్బందికి జీతాలు కూడా చెల్లించకపోవటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను ఎక్కడికక్కడే జోన్లకు అప్పగించారు. మరమ్మతులకు కావల్సిన పరికరాలను జోనల్ కమిషనర్లే కొనుగోలు చేసి, ఈఈఎస్ఎల్ సిబ్బందితే తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఈఈఎస్ఎల్ అగ్రిమెంట్ ముగిసిన దాదాపు 18 నుంచి 19 నెలలు గడుస్తున్నా, జీహెచ్ఎంసీ ఎందుకు ఏజెన్సీలను నియమించటంలో తాత్సారం చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టెండర్లు చేపట్టి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే, ఈ వర్షాకాలం వానలోనే రాకపోకలు సాగించే వాహనదారులకు కాస్త సౌకర్యంగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత గులాబీ సర్కారు హయాంలో రోడ్లను మరింత మెరుగుగా నిర్వహించేందుకు కాంప్రహెన్సీవ్ రోడ్డు మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) ని తెరపైకి తీసుకొచ్చారు. తొలుత 709 కిలోమీటర్ల రోడ్డుకు సంబంధించి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. తొలుత ఆరు జోన్లకు కలిపి రూ. 1800 కోట్లకు ఈ బాధ్యతలను అయిదేళ్లు సమయానికి అప్పగించారు. కానీ ఆ గడువు 2024 నవంబర్ లో ముగిసిపోయింది. ఆ తర్వాత మరో 1051 కిలోమీటర్ల రోడ్డును వివిధ రకాలుగా స్ట్రెచ్ లుకా విభజించి, రూ. 3145 కోట్ల వ్యయంతో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగినా, నేటికీ టెండర్ల విషయం కొలిక్కి రావటం లేదు. ఇప్పటికే చాలా చోట్ల రోడ్లు ధ్వంసమైన వాహనదారుల పాలిట శాపంగా మారాయి. వీటి మరమ్మతులకు సంబంధించి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. తాజాగా సీఆర్ఎంపీ కింద నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు గత పాలక మండలి, స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ప్రక్రియ ముందుకు సాగటం లేదు. దీంతో ఈ వర్షాకాలం వాహనదారులు గుంతల రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి తలెత్తింది.
Also read: బీజేపీ హిందూత్వానికి రేవంత్ ‘సనాతన’ చెక్.. అసలు వ్యూహం ఇదేనా?