Illegal Mining: స్వేచ్ఛ బ్యూరో: ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో గల ర్యాలంపాడు రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్ వద్ద నిల్వ ఉంచిన ప్రభుత్వ మట్టిని, గత వారం రోజులుగా మట్టి మాఫియా అడ్డగోలుగా, అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది టిప్పర్ల ద్వారా ఈ మట్టిని ధరూర్, కేటిదొడ్డి మండలాలతో పాటు గద్వాల పట్టణంలోని ప్రైవేట్ వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలకు తరలిస్తూ బహిరంగంగానే వ్యాపారం సాగిస్తున్నారు.
కోట్లాది రూపాయల విలువైన తమ సొంత పంట పొలాలను దేశానికి అన్నం పెట్టే ర్యాలంపాడు రిజర్వాయర్ కాలువ నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు. కానీ, నేడు అదే కాలువ మట్టిని కొందరు అక్రమార్కులు రాజకీయ, అధికార బలంతో దోచుకుంటుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. స్థానిక రైతులు తమ ఇండ్ల అవసరాల కోసం కొద్దిగా మట్టిని తీసుకెళ్తే క్షణాల్లో వచ్చి అడ్డుకునే ధరూర్ పోలీసులు, వారం రోజులుగా వందల టిప్పర్ల మట్టి అక్రమంగా తరలిపోతుంటే కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటి?
ఈ అక్రమ రవాణాపై ధరూర్ తహసీల్దార్కు, పోలీసులకు, మరియు ఇరిగేషన్ అధికారులకు జాంపల్లి రైతులు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. తమకు ఫిర్యాదు రాలేదని చెబుతూ అధికారులు బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు భారీగా మామూళ్లు అందడం వల్లే ఈ దోపిడీని చూసిచూడనట్లు వదిలేశారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. టిప్పర్ల మితిమీరిన శబ్దాలు, రాకపోకల వల్ల జాంపల్లి, ధరూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ర్యాలంపాడు కాలువ మట్టి అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలి. ఈ దోపిడీకి పాల్పడుతున్న మట్టి మాఫియాపై, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!