Minister Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం నిరంతరం ప్రక్రియ అని, గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జిల్లాల ఇన్ చార్జీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశామని, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని మంత్రి సూచించారు. పేదవారి అభివృద్ధి, సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలుచేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని, అలాగే మంచినీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: బీఆర్ఎస్ పార్టీ ఇక నుండి వర్ధంతిలు చేసుకోవాలి: ఎంపీ చామల
భూసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత సర్వే మ్యాపు నంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని తెలిపారు. సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను దఖలు పరిచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తొలివిడతలో శిధిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామని పేర్కొన్నారు.
అలాగే ప్రతిజిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇన్ చార్జీ మంత్రి దాసరి అనసూయ(సీతక్క), ఆదిలాబాద్ ఇన్ చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జీ వివేక్, ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Also read: కవిత పార్టీపై వారిద్దరి మౌనం… అనుచరగణం మాటల దాడి..!