KTR: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీలు కలిసి భవిష్యత్ తరాలకు మూసీ నదిని లేకుండా చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి, మూసీ జన్మస్థానమైన వికారాబాద్ జిల్లాలో 12 లక్షల చెట్లను, అడవులను నరికివేసి, అడవులను తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా, నేవీ రాడార్ స్టేషన్ పేరిట 2,000 ఎకరాలకు పైగా అడవులను తొలగించి, వికారాబాద్ జిల్లా ప్రకృతి స్వరూపాన్ని శాశ్వతంగా మార్చే కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఆదివారం వికారాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు, సర్ కార్యక్రమం పై కేడర్కు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ విశ్వనగరంగా మారాలని, మెట్రో నగరమైన హైదరాబాద్కి అత్యంత చేరువలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ వికారాబాద్ అని, ఇక్కడి అడవుల్లోని గాలికి అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉందని పేర్కొన్నారు. అలాంటి హిల్ స్టేషన్ను, అడవిని ప్రజలకు దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు మూసీని ప్రక్షాళన చేస్తామని చెబుతూనే, మూసీ జన్మస్థానంలో అడవులు లేకుండా చేస్తే మూసీ ఉనికి పూర్తిగా తొలగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ అడగగానే రాసిచ్చిన ఈ నేవీ రాడార్ స్టేషన్ భూముల్లో అడవుల తొలగింపు వల్ల, మూసీ భవిష్యత్ తరాలకు లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం హైదరాబాద్తో పాటు తెలంగాణలో ప్రకృతి స్వరూపాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో, గత ప్రభుత్వం కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రకృతి, పర్యావరణ సమతుల్యత కోసం ఒక్క ఎకరం కూడా రాసి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వేల ఎకరాలను కేంద్రానికి అప్పగించి పర్యావరణ హననానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు మరియు పదుల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించి, లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ హయాంలో రంగారెడ్డి జిల్లాలోని రైతులకు ఉన్న భరోసా పూర్తిగా పోయిందని, రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అరాచకాలు, కబ్జాలే కారణమని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి అరాచకాల వల్లే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన విమర్శించారు.
Also read: Jana Sena: ప్రజారాజ్యం పాత కాపులకు పవన్ కల్యాణ్ పిలుపు.. తెలంగాణలో జనసేన నెక్ట్స్ ప్లాన్ ఇదే..?
వికారాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా అనేక అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలు శాసనసభలో ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతులతో పాటు సబ్బండ వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
చివరగా, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆట ముగిసిందని, తిరిగి అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాకు ఉద్దండాపూర్ జలాశయం నుండి నీళ్లు అందించే పనులను గత ప్రభుత్వం పూర్తి చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. కేవలం కేసీఆర్కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే లక్షలాది మంది రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
Also read: Plane Crash: సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం.. హన్మకొండ జిల్లాకు చెందిన పైలట్ దుర్మరణం!