సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ‘చెప్పు తెగుద్ది’ అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.
మొబైల్ ఫోన్ల కొనుగోలుపై క్లారిటీ..
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఒక్కో మొబైల్ ఫోన్ను ప్రభుత్వం కేవలం 11,650 రూపాయలకే కొనుగోలు చేసిందని వెల్లడించారు. అయితే 14 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పారదర్శకంగా సాగుతున్న ప్రక్రియపై ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీదనే బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.
మేడారం పనుల్లో అవినీతి లేదు..
మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో వస్తున్న ఆరోపణలను సీతక్క తోసిపుచ్చారు. కాంట్రాక్టర్ల వద్ద తాను కానీ.. తన అనుచరులు కానీ ఎలాంటి కమిషన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. అక్కడ జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో రాతి శిల బాలుడిపై పడి మరణిస్తే.. దానిని కూడా రాజకీయాలకు వాడుకోవడం బీఆర్ఎస్ దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రమాదాలకు కూడా కాంగ్రెస్ పార్టీని బాధ్యులను చేస్తూ విమర్శలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాకు వార్నింగ్..
సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి సీతక్క హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేసే వారి తాట తీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని.. ప్రతిపక్షాల జిమ్మిక్కులు ఇకపై సాగవని ఆమె పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు.