Padi Kaushik Reddy: స్వేచ్ఛ బ్యూరో: నేటి బాలలే రేపటి దేశ గౌరవాన్ని పెంచే పౌరులని, వారి సమగ్రాభివృద్ధికి విద్యే ప్రాధాన్యమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ’ లో భాగంగా బుధవారం స్థానిక వి.ఎల్.ఆర్. ఫంక్షన్ హాల్లో విద్యా వారోత్సవాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, కౌన్సిలర్లతో నిర్వహించిన ఎడ్యుకేషన్ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.
గ్రామీణ విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వమైనా విద్యపై చేసే ఖర్చును వ్యయంగా భావించకూడదని, అది సమాజ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాల ఏర్పాటు ద్వారా అట్టడుగు వర్గాల బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యా రంగానికి నిధులను పెంచి, విద్యా సంవత్సరం ఆరంభంలోనే పుస్తకాలు, యూనిఫాం లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆడబిడ్డ చదివితేనే కుటుంబానికి వెలుగు
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గొంటాల సుహాసిని మాట్లాడుతూ.. ఒక బాలుడు చదివితే ఆ వ్యక్తి మాత్రమే ఎదుగుతాడని, అదే ఒక బాలిక చదివితే ఆ కుటుంబమే వెలుగుతుందన్నారు. పుస్తకం పట్టిన వాడే చరిత్ర సృష్టిస్తాడని వ్యాఖ్యానించారు. అనంతరం సి.డి.పి.ఓ సుగుణ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. పదిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎం.ఈ.ఓ శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి. సునీత, ఎం.ఈ.ఓలు హేమలత, రాములు, శోభారాణి, ఏ.ఎం.ఓ అశోక్ రెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాగా, కీలకమైన ఈ అవగాహన సదస్సుకు ప్రజాప్రతినిధులు, అధికారుల హాజరు తక్కువగా ఉండటంపై చర్చ జరిగింది.
Also Read: ఎవరి ఆదేశాలతో ఆపుతున్నారు? పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ గడ్డం వంశీ ఫైర్!