Gadwal Police: స్వేచ్చ బ్యూరో: గద్వాల జిల్లా కేంద్రంలో రాత్రి వేళల్లో పోలీసుల నిఘా కరువైందని పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో గల కృష్ణవేణి విగ్రహం ముందు మందుబాబులు యథేచ్ఛగా నడిరోడ్డుపైనే కూర్చుని మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ, ఏమాత్రం భయం లేకుండా బహిరంగంగా మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇంతగా మద్యం సేవిస్తున్న పోలీసులు అటువైపు రాకపోవడం పోలీసుల పని తీరు పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో నిరంతరం జరిగే పోలీస్ పెట్రోలింగ్, బీట్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా పడకేసిందని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలకల్లా వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసివేయాల్సి ఉన్నప్పటికీ, జిల్లా కేంద్రంలో మాత్రం అర్ధరాత్రి వరకు చాయ్ హోటల్స్, కూల్ డ్రింక్స్, పాన్ షాపులు తెరిచే ఉంటున్నాయి. ఈ దుకాణాల వద్దే మందుబాబులు గుంపులు గుంపులుగా చేరుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ వ్యాపారాలు సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో రాత్రి వేళల్లో నిరంతరం జరిగే పోలీస్ పెట్రోలింగ్, బీట్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా పడకేసిందని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. యువకులు ద్విచక్ర వాహనాలను స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
Also read: Harish Rao: పౌరుషం ఉంటే రాజీనామా చెయ్.. మంత్రి జూపల్లికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!
జిల్లా కేంద్రంలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించే పోలీసులు రోజువారి టార్గెట్ ల కోసమే నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టార్గెట్ లు ముగిసాక ఎవరేం తాగి తందానలు ఆడిన పోలీసులు పట్టించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. గద్వాల డీఎస్పీ, గద్వాల సీఐ కార్యాలయం కూత వేటు దూరంలో మందుబాబులు మద్యం సేవిస్తున్న తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 దాటిన తర్వాత కూడా తెరిచే ఉంచే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గురువారం గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణవేణి చౌరస్తాలో సిట్టింగ్ చేసిన మందుబాబులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మందుబాబులు తాము మద్యం సేవించడానికి అక్కడ కూర్చోలేదని బోజనం చేయడానికి కూర్చునట్లు వారు తెలిపారు.
Also read: Function Zone: సామాన్యులకు గుడ్ న్యూస్.. 25 వేలకే నెక్లెస్ రోడ్డులో ఫంక్షన్ హల్..!