Siddipet: సిద్దిపేట జిల్లాలో బుధవారం అర్థరాత్రి అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన చావు.. ఒకే ఇంట్లోని నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. చీకట్లో కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పసిపాపలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ప్రమాదం జరిగిందిలా..
దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), తన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి పనిమీద సిద్ధిపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం అర్థరాత్రి కారులో స్వగ్రామానికి వస్తుండగా.. అప్పనపల్లి శివారులోకి రాగానే కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన రక్షణ లేక తెరిచి ఉన్న బావిలోకి నేరుగా దూసుకెళ్లింది. నీటిలో మునిగిపోవడంతో కారులోనే శ్వాస ఆడక కుటుంబం మొత్తం మృతి చెందింది.
వెలికితీసిన సహాయక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి వేళ కావడం, బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. చివరికి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. వాహనంలోంచి నాలుగు మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!