Pre-Primary Education: సేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ(పూర్వ ప్రాథమిక) తరగతుల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే 1,362 పాఠశాలల్లో ఈ విధానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టగా, ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో అదనంగా మరో 2,769 ప్రభుత్వ పాఠశాలలకు అనుమతులు మంజూరయ్యాయి. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-ఫౌండేషనల్ స్టేజ్ 2022 సిఫార్సుల మేరకు చిన్నారుల్లో పాఠశాల సన్నద్ధతను పెంపొందించేందుకు ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ తరగతులలో కల్పించనున్నారు.
ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల కోసం పాఠ్య ప్రణాళికలతో కూడిన ఉపాధ్యాయుల హ్యాండ్బుక్ ఫిజికల్ కాపీ అందజేయడంతో పాటు ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో సాఫ్ట్ కాపీ అందుబాటులో ఉంచారు. చిన్నారుల కోసం భాషా నైపుణ్యాలు, సంఖ్యా నైపుణ్యాలపై రెండు ప్రత్యేక వర్క్బుక్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటితో పాటు క్యూఆర్ కోడ్ ఆధారిత రైమ్స్, కథల కార్డ్స్, వీడియోల వంటి బోధనా అభ్యసన సామాగ్రిని ఉపాధ్యాయులు ఉపయోగించాల్సి ఉంటుంది. తరగతి గది అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా సీనియర్ ఉపాధ్యాయులు ప్రతి వారం ముఖ్యంగా శుక్రవారం కనీసం ఒక తరగతిని పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు తగిన సూచనలు, ఫీడ్బ్యాక్ను ప్రత్యేక డైరీలో నమోదు చేయాలని పేర్కొన్నారు.
Also Read: ఎలక్ట్రికల్ బస్సుల వెనుక అసలు కథ ఇదేనా..? ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ సంచలనం!
ఇదిలాఉండగా చిన్నారుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పెంపొందించడానికి ప్రతి తరగతి గదిలో నాలుగు కార్నర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రీడింగ్ కార్నర్ (పుస్తకాలు, పిక్చర్ కార్డ్స్), కాగ్నిటివ్ కార్నర్(పజిల్స్, నంబర్ కార్డ్స్, మ్యాచింగ్ కార్డ్స్), క్రియేటివ్ కార్నర్(క్లే, రంగు పెన్సిళ్లు, డ్రాయింగ్ షీట్లు), ప్లే కార్నర్(బొమ్మలు, వంట సామగ్రి, పాత్ర పోషణకు అవసరమైన దుస్తులు) వంటివి ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ప్రీ-ప్రైమరీ పిల్లలకు ఎలాంటి అధికారిక పరీక్షలు నిర్వహించరని స్పష్టంచేశారు.
ప్రతి నెలా 18, 19 తేదీల్లో ఉపాధ్యాయులు మౌఖిక సంభాషణలు, వర్క్షీట్ల ఆధారంగా పిల్లల ప్రగతిని అంచనా వేస్తారని తెలిపారు. పాఠశాల సమయ పట్టికలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు వివిధ యాక్టివిటీలతో కూడిన టైమ్ టేబుల్ను ఖరారు చేశారు. ఇందులో అసెంబ్లీ, సర్కిల్ టైమ్, స్టోరీ టైమ్, ప్లే టైమ్ వంటి విభాగాలు ఉన్నాయి. పాఠశాల ఆవరణలో పిల్లల శారీరక, మానసిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శారీరక దండనలు పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లను ఆదేశించారు.
Also read: కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!