Kalyana Lakshmi: స్వేచ్ఛ బ్యూరో: కల్యాణ లక్ష్మీ స్కీమ్కు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంలో వచ్చే నగదుతో పాటు అదనంగా మరి కొంత ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. తులం బంగారం స్థానంలో ఆ అమౌంట్ ను యాడ్ చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఇందుకు ప్రభుత్వ పెద్దలు, ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ తులం బంగారంకు బదులు బోనస్ పేరిట అమౌంట్ ఇస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే దానిపై సర్కార్ తర్జన భర్జన పడుతున్నది. లక్ష్యణ లక్ష్మీతో రెగ్యులర్ గా ఇచ్చే డబ్బుతో పాటు సుమారు యాబై వేలు అదనంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. కానీ ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేవలం సర్కార్ లోనే అంతర్గతంగా డిస్కషన్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో చర్చలు అనంతరం కేబినెట్లో చర్చించి అమలు చేయనున్నారనే టాక్ వినిపిస్తున్నది. అయితే దీనికి శాసన సభ్యులు, పబ్లిక్, పార్టీ ముఖ్య లీడర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానున్నదని కీలక ఆఫీసర్ తెలిపారు.
పేద కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేసేందుకు గత ప్రభుత్వం 2 అక్టోబరు 2014లో కల్యాణ లక్ష్మీ అనే పథకాన్ని ప్రారంభించి తొలుత రూ.51 వేలు ఆర్ధిక సాయం అందించింది. ఆ తర్వాత రూ.75,116, ఆ మురుసటి రూ.లక్షా 116 లకు పెంచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ స్కీమ్ ద్వారా ఏకంగా సుమారు 12 లక్షల మంది లబ్ధి పొందినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కోసం సుమారు రూ. 12 వేల కోట్ల నుండి రూ 14 వేల కోట్ల వరకు వెచ్చించింది. ఈ పథకానికి పబ్లిక్ లో ఊహించని మైలేజ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. చాలా మంది మహిళలను ఈ అంశం ప్రభావితం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించినట్లుగానే విజయం సాధించింది. కానీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఈ కీలక హామీ అమలుకు ప్రభుత్వానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
Also Read: Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయలు నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర సుమారు లక్ష వరకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే భారీ స్థాయిలో నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బోనస్ పేరిట ఓ ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలని ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏడాదికి సగటున 1.5 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, వీరికి ఈ స్కీమ్తో పాటు బోనస్ ఇవ్వాలంటే కల్యాణ లక్ష్మీకి కేటాయిస్తున్న బడ్జెట్ లో మరో 30 శాతానికి పైగా నిధులు అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్ కు సుమారు 2 వేల కోట్లు అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. తులం బంగారానికి ఖర్చుతో పోల్చితే ఈ నిర్ణయం వలన కొంత వరకు ఆర్ధిక భారం తగ్గుతుందనే చర్చ ప్రభుత్వంలో ఉన్నది.
Also Read: Kukatpally Robbery: కళ్ళల్లో కారం కొట్టి ‘కోటి’ దోపిడీ చేసిన గ్యాంగ్ అరెస్ట్..!