Smart Meters: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే దిశగా టీజీ ఎస్పీడీసీఎల్ కసరత్తు చేస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న సంప్రదాయ మీటర్ల స్థానంలో దశలవారీగా స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని యోచిస్తోంది. దీనిపై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)తో చర్చలు జరిపి విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి, ఆ తర్వాత దశలవారీగా పాత మీటర్లను కూడా వాటితో భర్తీ చేసే ఆలోచనలో ఎస్పీడీసీఎల్ ఉంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ వినియోగాన్ని మరింత కచ్చితంగా నమోదు చేయడంతో పాటు, బిల్లింగ్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
వినియోగదారులపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా స్మార్ట్ మీటర్లను రెంట్ విధానంలో అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ విధానంలో మీటర్ వ్యయాన్ని వినియోగదారుల నుంచి ఒకేసారి వసూలు చేయకుండా, నిర్ణీత కాలంలో విడతల వారీగా రికవరీ చేసే అవకాశం ఉంది. దీనిపై నియంత్రణ మండలితో చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారుల విద్యుత్ వినియోగ వివరాలను మరింత సమర్థంగా పర్యవేక్షించే వీలు కలుగుతుందని భావిస్తున్నారు. మీటర్ రీడింగ్ ప్రక్రియలో మానవ జోక్యం తగ్గడంతో తప్పులు, వివాదాలకు అవకాశం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు కూడా తమ విద్యుత్ వినియోగ తీరును మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు స్మార్ట్ మీటర్ల వ్యవస్థను డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పర్యవేక్షణకు అనుసంధానించే అవకాశాలను కూడా ఎస్పీడీసీఎల్ పరిశీలిస్తోంది. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లపై లోడ్, విద్యుత్ సరఫరా పరిస్థితి తదితర అంశాలను మెరుగ్గా పర్యవేక్షించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల అమలుపై మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నియంత్రణ మండలితో చర్చలు, సాంకేతిక అంశాల పరిశీలన, వినియోగదారులపై ప్రభావం వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు విధానాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: జీహెచ్ఎంసీలో నాన్-లోకల్ అధికారుల పైరవీలు.. ఈఎంఐ కట్టాలంటూ లంచాలు డిమాండ్!
విద్యుత్ రంగంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక, పరిపాలనా, వినియోగదారుల సేవల గురించి ప్రజలకు వివరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ పవర్ ఎగ్జిబిషన్ 2026ను నిర్వహించనుంది. శనివారం నుంచి మొదలుకుని ఈనెల 24 వరకు ఈ ఎగ్జిబిషన్ కొననసాగనుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతితో పాటు భవిష్యత్ సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. స్కాడా విస్తరణ, ఎఫ్ఎల్ఐఎస్ఆర్, స్మార్ట్ మీటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు, డిజిటల్ నెట్వర్క్ మ్యాపింగ్, ఇతర ఆధునీకరించిన వినియోగదారుల సేవలను ప్రదర్శనలో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.
విద్యుత్ అంతరాయాలను వేగంగా గుర్తించి పరిష్కరించే ఫాల్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలు, రియల్టైమ్ మానిటరింగ్, పవర్ అంబులెన్స్ సేవలను కూడా ప్రత్యక్షంగా చూపించనున్నారు. కాగా ఈ ఎగ్జిబిషన్ పనులు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా శుక్రవారం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు పనులను ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్న వివిధ విద్యుత్ రంగ ప్రదర్శన స్టాళ్లు, సందర్శకుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పార్కింగ్ సదుపాయాలు, ప్రవేశ ద్వారాలు, వేదిక నిర్మాణం, డిజిటల్ డిస్ప్లేలు, అవగాహన కేంద్రాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎండీ వెంట ప్రాజెక్ట్స్, ఐటీ డైరెక్టర్ శివాజీ ఉన్నారు.
Also Read: సౌత్ సినిమాలకు నెట్ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!