Telangana Prisons: రాష్ట్రంలోని జైళ్లు పరివర్తనా కేంద్రాలుగా మారాయి. వేర్వేరు నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారితోపాటు రిమాండ్ ఖైదీల్లో మార్పు తీసుకు రావటంలో గణనీయ ఫలితాలను సాధిస్తున్నాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని అధికారులు ఆ ఉచ్ఛులో నుంచి బయటకు తీసుకొస్తున్నారు. విడుదలైన తరువాత కూడా ఫాలో అప్ సేవలు అందిస్తూ మరోసారి డ్రగ్స్ జోలికి పోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ సంస్కరణలు అమలు చేస్తున్న జైళ్ల శాఖగా మన తెలంగాణ జైళ్ల శాఖ గుర్తింపును సాధించింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాల నియంత్రణ సంస్థ, టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టూ యాక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంజాబ్ జైళ్ల శాఖ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ‘డ్రగ్స్, హెచ్ఐవీ అండ్ ప్రిజన్ హెల్త్ రెస్పాన్సెస్’ జాతీయ సదస్సులో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రత్యేక ఆహ్వానంపై హాజరై ప్రజంటేషన్ ఇచ్చారు.
వేర్వేరు నేరాలకు పాల్పడి అరెస్ట్ అయి జైళ్లకు వస్తున్న ఖైదీలకు ప్రవేశ సమయంలోనే ఆయా జైళ్ల అధికారులు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నారు. గత సంవత్సరం జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు 12,675 మంది ఖైదీలకు అడ్మిషన్ ఇచ్చే సమయంలో టెస్టులు జరిపారు. దీంట్లో 4,200 మంది ఖైదీలకు డ్రగ్స్ అలవాటు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా 1,563మంది ఖైదీలు గంజాయికి అలవాటు పడినట్టుగా తేలింది. కల్తీ కల్లుకు 815మంది బానిసలుగా మారినట్టు వెల్లడైంది. 160మంది సెడెటీవ్ మాత్రలు, 72మంది సెడెటీవ్ ఇంజక్షన్లు, 60మంది ఎండీఎంఏ, 40మంది మెథాంఫెటమైన్, 33మంది ఎల్ఎస్డీ బ్లాట్స్, 31మంది కొకైన్, 50మంది ఓపీఎం డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా తేలింది.
Also read: ఫ్యూచర్ సిటీ పెట్టుబడిదారులకు కేటీఆర్ వార్నింగ్! అక్కడ ఫార్మాసిటీనే ఉంటుంది!
వీరందరికీ హైదరాబాద్, చర్లపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి సెంట్రలో జైళ్లు, చంచల్ గూడ మహిళల ప్రత్యేక జైల్లోని ‘నివృత్తి।’ డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా అధికారులు పునరావాస సేవలు అందించారు. ఇందులో భాగంగా 4,100 వ్యక్తిగత కౌన్సెలింగ్ సమావేశాలు, 1,150 ఫాలోఅప్ కౌన్సెలింగ్లు, 507 సైకోఎడ్యుకేషన్-గ్రూప్ సెషన్లు, 317 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్రమంగా ఖైదీల్లో మార్పు తీసుకొస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే విడుదలైన ఖైదీలకు ఫాలో అప్ సేవలు అందిస్తున్నారు.
విడుదలయ్యే సమయంలో ఖైదీల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న అధికారులు వారితో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. మార్పు తెచ్చుకుని సక్రమ మార్గంలో జీవిస్తున్నారా? లేదా? అన్న దాంతోపాటు డ్రగ్స్కు దూరంగా ఉంటున్నారా? లేదా? అన్న వివరాలను తెలుసుకుంటూ ఫాలో అప్ సేవలు అందిస్తున్నారు. ఈ చర్యలు ఖైదీల్లో మార్పు తీసుకొస్తున్నట్టుగా జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. నివృత్తి డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా ఇప్పటివరకు 15,645మంది ఖైదీలకు సేవలు అందించినట్టు చెప్పారు.
Also read: మీ త్యాగం వృథా కాదు.. మెరుగైన జీవితం కల్పిస్తా.. వెలిగొండ నిర్వాసితులకు సీఎం హామీ