Antara Banerjee Arrested: ప్రముఖ నటి, మోడల్ అంతరా బెనర్జీ అరెస్ట్ అయ్యింది. రైల్లో జరిగిన గొడవ కారణంగా రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆరావళి ఎక్స్ ప్రెస్ లో జరిగిన గొడవకు సంబంధించి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 12న జరిగినట్లు తెలుస్తోంది.
అంతరా బెనర్జీ షూటింగ్ కోసం సూరత్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆమె దగ్గర స్లీపర్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ ఏసీ కోచ్లో ప్రయాణిస్తున్నారని పోలీసుల ఫిర్యాదులో వెల్లడించారు. రిజర్వ్ చేసిన సీటు విషయంలో ఓ ప్రయాణికుడితో ఆమెకు వివాదం మొదలైనట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు. విషయం తీవ్రతరం కావడంతో టికెట్ కలెక్టర్ హరికేష్ త్రిపాఠి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బందిని అక్కడికి పిలిచారు.
RPF అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యమినికాంత్ మిశ్రా, కానిస్టేబుల్ రాజేష్ కుమార్ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అంతరా బెనర్జీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె రేజర్ బ్లేడ్ తో సదరు రైల్వే పోలీసు అధికారిపై దాడి చేసింది. ఈ ఘటనలో యమినికాంత్ మిశ్రాకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆమె తనను తాను గాయపరుచుకున్నారని, కోచ్ కిటికీని పగలగొట్టి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తర్వాత అంతరా బెనర్జీని దహను దగ్గర రైలు నుంచి దించి ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మరుసటి రోజు ఉదయం బోరివాలి రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 13న ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, హాని కలిగించడం, భద్రతకు ప్రమాదం కలిగించడం, అధికారులను అవమానించడం లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆమెకు నోటీసు జారీ చేసి బెయిల్పై విడుదల చేసినట్లు సమాచారం.
అంతరా బెనర్జీ హిందీ టెలివిజన్లో పలు సీరియల్స్ లో నటిగా కొనసాగుతోంది. ఆమె ‘గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్’ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘సావధాన్ ఇండియా’లో కూడా కనిపించారు. 2014లో ‘ది షౌకీన్స్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అనంతరం ‘బధో బహు’ సీరియల్లో పింకీ అహ్లావత్ పాత్రలో నటించి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అంతరా ‘లాల్ ఇష్క్’లో కనిపించారు. 2018లో ప్రముఖ సీరియల్ ‘కసౌతీ జిందగీ కే’లో సుమన్ శర్మ పాత్రను పోషించారు. 2019లో ఆమె ఈ షో నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా ‘కవచ్ 2’లో సంజనా జిందాల్ పాత్రలో నటించారు. ఆమె కెరీర్లో క్రైమ్, ఫ్యామిలీ డ్రామా, అతీంద్రియ కథాంశాలతో కూడిన సీరియల్స్ ఉన్నాయి. అంతరా బెనర్జీ ‘ది షౌకీన్స్’తో పాటు ‘యే హై ఇండియా’ సినిమాలో కూడా నటించారు. ‘యే హై ఇండియా’లో ఆమె రిపోర్టర్ పాత్రలో కనిపించారు. కోల్కతాలో బెంగాలీ కుటుంబంలో జన్మించిన అంతరా, నటనా రంగంలో కెరీర్ కొనసాగించేందుకు తరువాత ముంబైకి వెళ్లారు. ప్రస్తుతం రైల్లో దాడికి సంబంధించిన కేసు కారణంగా ఆమె వార్తల్లోకి వచ్చింది.
Read Also: హైదరాబాద్ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో ఆ రైళ్లకు హాల్టింగ్!