Bhogapuram Airport First Flight: ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్రకు సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ముగిశాయి. అదే సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి చివరి విమానం బయలుదేరింది. రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి వెళ్లిన ఇండిగో విమానం చివరి సర్వీస్గా నిలిచింది. ఎన్నో సంవత్సరాలుగా విశాఖకు విమాన ప్రయాణ సేవలు అందించిన ఈ విమానాశ్రయం నుంచి సాధారణ కమర్షియల్ సర్వీసులను ముగించింది. విశాఖ విమానాశ్రయం స్థానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాన విమానయాన కేంద్రంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సర్వీసు సోమవారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం 6E6408 ఉదయం 6.38 గంటలకు భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
కొత్త విమానాశ్రయంలో దిగిన తొలి దేశీయ ప్రయాణికులకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. విమానం రన్వేపైకి వచ్చిన సమయంలో వాటర్ కెనాన్ సెల్యూట్ తో ప్రత్యేకంగా స్వాగతం చెప్పారు. అనంతరం ప్రయాణికులతో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర సంప్రదాయానికి ప్రతీకగా ఏటికొప్పాక బొమ్మలను కూడా ప్రయాణికులకు బహుమతిగా అందించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రారంభమయ్యాయి. సింగపూర్ నుంచి వచ్చిన స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం కొత్త విమానాశ్రయంలో తొలి అంతర్జాతీయ కమర్షియల్ సర్వీస్గా నిలిచింది. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. కొద్దిసేపటి తర్వాత అదే విమానం ప్రయాణికులతో తిరిగి సింగపూర్కు బయలుదేరింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విమానయాన సేవలకు కూడా శ్రీకారం చుట్టింది.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నిర్వహించేందుకు అనుగుణంగా రూపొందించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఉన్న కొన్ని పరిమితులకు ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనిచేయనుంది. కొత్త విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇతర నగరాలు, విదేశాలతో విమాన కనెక్టివిటీ మరింత పెరగనుంది.
విమాన కనెక్టివిటీ పెరగడం వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులకు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా విశాఖ విమానాశ్రయం అధ్యాయం ముగియగా.. భోగాపురంలో కొత్త ప్రయాణం మొదలైంది. తొలి దేశీయ, అంతర్జాతీయ విమానాలతో ప్రారంభమైన ఈ కొత్త విమానాశ్రయం రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకు కీలక రవాణా కేంద్రంగా ఎదగనుంది.
Read Also: గాల్లోకి ఎగిరిన తొలి ఎలక్ట్రిక్ విమానం.. అరగంట పాటు ఆకాశంలో చక్కర్లు!