Ambika Shukla: ఢిల్లీలో వీధి కుక్కల తరలింపు వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సోదరి, పెటా కార్యకర్త అంబికా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేబిస్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాదన్నారు. కుక్క కాటును జస్ట్ సబ్బుతో కడిపోయినా రేబిస్ వైరస్ చనిపోతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే మీరే కరిపించుకోండి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు
ఢిల్లీ-ఎన్సిఆర్లోని వీధికుక్కలను 8 వారాల్లో షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 11న ఇచ్చిన ఈ తీర్పుపై జంతుకు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న పెటా కార్యకర్త అంబికా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.”రేబిస్ బ్యాధి అనేది ఇన్ ఫెక్షన్ లాలాజలం రక్తంలో కలిసినప్పుడే రేబిస్ వైరస్ వ్యాపిస్తుందన్నారు. వైరస్ చాలా సున్నితమైనది. గాయాన్ని సబ్బుతో కడిగినా రేబిస్ వైరస్ చనిపోతుంది” అంటూ వ్యాఖ్యానించారు. “దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. దేశంలో కేసుల సంఖ్య ఎంత ఉంది? ఎందుకంటే రేబిస్ చాలా అరుదైన వ్యాధి. ఇది సులభంగా వ్యాపించదు. నిజం చెప్పాలంటే, కుక్కలు బలవంతంగా ఎవరినీ కరవవు” అని చెప్పుకొచ్చింది.
అంబికా శుక్లా కామెంట్స్ పై నెటిజన్ల ఆగ్రహం
అంబికా శుక్లా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేబిస్ వ్యాధి గురించి ఆమెకు బేసిక్ విషయాలు తెలియదని అర్థం అవుతోందంటూ మండిపడుతున్నారు. “నేను వైద్యుడిని కాదు, కానీ, వైద్య పరిజ్ఞానం ఆధారంగా నేను స్పష్టం చేయగలను. రేబీస్ అనేది తేలికపాటి వైరస్ కాదు. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రాణాంతక వైరల్ వ్యాధి. లక్షణాలు కనిపించిన తర్వాత దాదాపు 100% ప్రాణాంతకం. సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి మాత్రమే కాటు వేసిన వెంటనే సబ్బుతో కడుక్కోవడం సిఫార్సు చేయబడింది. ఎందుకంటే ఇది గాయం నుండి వైరస్ను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, ఇది వైరస్ పూర్తిగా తొలగిపోతుందని హామీ ఇవ్వదు. టీకాలు, ఇమ్యునోగ్లోబులిన్తో పోస్ట్-ఎక్స్ పోజర్ ప్రొఫిలాక్సిస్ వంటివి చాలా అవసరం. అంత సీరియస్ వ్యవహారాన్ని సబ్బుతో కడిగితే చాలు అనడం సరికాదు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “డాక్టర్లు, వైద్య సంస్థలకు నా విజ్ఞప్తి. దయచేసి ముందుకు వచ్చి ఈ దేశంలోని ప్రజలకు రేబీస్ మరణాల గురించి తెలియజేయండి. రేబీస్ ఎంత ప్రమాదమైనదో వివరించండి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
జూలైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ICMR-NIE) దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో.. దేశంలో ఏటా 5,700 మందికి పైగా ప్రాణాలను కోల్పోతున్నట్లు తేలింది. కుక్క కాటు గాయాన్ని సబ్బుతో కడగడం తప్పనిసరి అయినప్పటికీ, దానితో రేబిస్ పూర్తిగా తొలగిపోదు ఎందుకంటే ఇది వైరల్ లోడ్ ను మాత్రమే తగ్గిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Read Also: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?