Jeevan reddy: స్వేచ్ఛ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. అత్యంత ప్రాధాన్యతగల ఈ అంశంపై కేబినెట్ లో చర్చనే పెట్టకపోవటం శోచనీయమన్నారు. వరి ధాన్యం కొనుగోలులో ప్రతీ క్వింటాలుకు రైతు 250 రూపాయలు నష్టపోతున్నట్టు చెప్పారు. దీనిని ఆర్ఆర్ ట్యాక్స్ గా పరిగణించాల్సి వస్తోందన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ సైతం రైతులను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు పంట పంటకు రైతు బంధు వచ్చేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని చెప్పారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఏనాడూ కరీంనగర్ రాలేదు, ధాన్యం కొనుగోలుపై రివ్యూ చేయలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల నిర్వహణ, ఫుట్ బాల్ పోటీలు చేసుకోవటమే సరిపోయిందని విమర్శించారు. రైతు సమస్యలపై సీఎం ఎందుకు ఒక్క రివ్యూ కూడా చేయలేదని ప్రశ్నించారు. మండుతున్న ఎండలతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోతున్నారని చెప్పారు. వరి ధాన్యం యాభై శాతం కల్లాల్లోనే ఉంది, అకాల వర్షాలతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. మొక్కజొన్న కొనుగోలులో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Also Read: Cotton Prices: పత్తి రైతులకు తీపి కబురు..?
వరి ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు కల్లాల్లో తిరిగితే అసలు పరిస్థితి తెలుస్తుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పేరుతో అందరినీ మభ్యపెడుతున్నారని హరీశ్ రావు చెబితే మంత్రి శ్రీధర్ బాబు ఉలిక్కి పడుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం ఫార్మా సిటీ భూములను తన అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో, రాదో అర్థమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. యూరియా కోసం యాప్ తెచ్చారు. పని చేయని యాప్ తో రైతులకు ఒరిగేది ఏందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోయిన రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలే అని చెప్పారు. మరణించిన ప్రతీ రైతుకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 31లోపు వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనాలన్నారు. అలా చేయలేకపోతే జూన్ 2న జెండా ఆవిష్కరించే నైతికత రేవంత్ రెడ్డికి ఉండదని చెప్పారు.
Also read: Crop Procurement: విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చిపడేసిన మంత్రి తుమ్మల..!