Seethakka Legal Notice KCR: అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరిగిందని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆరే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రి తరపు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్ ఈ నోటీసును రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కు పంపారు.
అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని సీతక్క ఈ నోటీసులో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (TGTS) నిర్వహించిందని.. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అర్హత గల సంస్థకు కాంట్రాక్ట్ దక్కిందని వివరించారు. ఈ కొనుగోలులో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి సంబంధం లేదని.. కేవలం రాజకీయంగా తనను దెబ్బతీయాలనే కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కనీస విజ్ఞతకు దూరంగా ఉన్నాయని మంత్రి సీతక్క విమర్శించారు. మొత్తం టెండర్ విలువ కేవలం రూ. 44 కోట్లు మాత్రమేనని.. అందులో రూ. 30 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రచారం చేయడం అత్యంత అసంబద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వాస్తవాలకు పొంతన లేని ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షం ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని ఆమె అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో పెట్టిన ఈ అభ్యంతరకర పోస్టులను 48 గంటల్లోగా తొలగించాలని.. ఈ నిరాధార ఆరోపణలపై కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్దేశించిన సమయంలోగా స్పందించకపోతే సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంగన్వాడీ మహిళలకు మేలు చేసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదని.. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలను సహించే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.