Kishan Reddy: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 4 వేల బంకుల్లో 106 బంకులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ దిల్ ఖుషా గెస్ట్ హౌజ్ లో బుధవారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, లభ్యతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ.. నాలుగైదు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారం జరిగిందని, కానీ ఎక్కడా కొరత లేదన్నారు.
ప్రజలందరికీ ఏ సమస్య లేకుండా ఎల్పీజీ అందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపార. పెట్రోల్, డీజిల్ ను రెట్టింపు స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. డబ్బులు కట్టలేని బంకులకు మాత్రమే పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడంలేదని పునరుద్ఘటించారు.
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గతంలో కొంత సమస్య వచ్చిన మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి అంగీకరించారు. అయితే 88 శాతం ఇతర దేశాల మీద ఆధారపడి పెట్రోల్, డీజిల్ ను దేశానికి తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. కావాల్సినంత స్టాక్ ఉందని, స్టాక్ లేకపోతే ప్రజలకు చెప్తామని వెల్లడించారు. కావాలనే పలు రాజకీయ పార్టీల నేతలు రేట్లు పెరుగుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.
Also Read: Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
పెట్రోల్, డీజిల్ ను అనవసరంగా ఎవరూ ఇండ్లలో పెట్టుకోవద్దని, వేసవి వల్ల మరింత ప్రమాదం పెరుగుతుందని కిషన్ రెడ్డి సూచించారు. మరోవైపు ఆటో ఎల్పీజీ సమస్య కూడా లేదని స్పష్టం చేశారు. అటు రాహుల్ గాంధీ రేట్లు పెరుగుతాయని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రజలు ఎవరూ అసత్య ప్రచారాలు నమ్మొద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు.
Also Read: ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!