TGSRTC: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద జేబీఎమ్ ఎలక్ట్రిక్ బస్సులలో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎమ్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలిక నిలిపివేసింది. గురువారం ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 21న కరీంనగర్ లోని అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదం పై పూర్తి నివేదిక రాకముందే మరొ ఘటన జరిగింది. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రజల ప్రాణాల రక్షణే ప్రాధాన్యతగా భావించి నిలిపివేత నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై నివేదిక అందజేయాలని ఆదేశించింది.
Also read: Gadwal Police: డీఎస్పీ ఆఫీస్ పక్కనే మందు బాబుల సిట్టింగ్ వీరంగం.. పట్టించుకోని అధికారులు..?
భద్రతా ప్రమాణాలు, సంబంధిత నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జేబీఎం యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందితే, వారి టెక్నికల్ బృందం ” వెహికిల్ ఫిట్ ఫర్ ఆపరేషన్ ” అని ధృవీకరించిన వాహనాల పునరుద్ధరణ పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ప్రజారవాణాలో భద్రత విషయంలో ఆర్టీసీ ఎటువంటి రాజీ పడదని, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది.
Also Read: Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!