Indian Railways: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణాలు కొనసాగిస్తారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని పొందుతారు. సుదూర ప్రయాణాలు చేసేందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ట్రైన్ జర్నీ చేయాలనుకునే ప్రయాణీకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాలనుకునే ప్రయాణీకులు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, తత్కాల్ టికెట్స్ బుకింగ్ అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. విండో ఓపెన్ అయిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోతాయి. ఇదే అదునుగా భావించి కొంత మంది సైబర్ నేరస్తులు తత్కాల్ స్కామ్ కు తెగబడుతున్నారు. IRCTC టికెట్ బుకింగ్ వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని ఎలా మోసాలకు పాల్పడుతున్నారో తాజా దర్యాప్తులో వెల్లడైంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఐడీల కొనుగోలు
తత్కాల్ టికెట్లను అక్రమంగా బుక్ చేసేందుకు కేటుగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లను ఉపయోగిస్తున్నారు. ఆధార్-ప్రామాణీకరించబడిన IRCTC వినియోగదారులు తమ ఐడీలను ఇందులో అమ్ముతున్నారు. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి కీలకమైన ఈ ఐడీలు ఒక్కొక్కటి రూ.360కి అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు తత్కాల్ బుకింగ్ల కోసం వారి ఆధార్ గుర్తింపు ద్వారా ధృవీకరించబడాలి. దీన్ని అదిగమించేందుకు సైబర్ నేరస్తులు ఇలాంటి పని చేస్తున్నారు.
బాట్లు, మాల్వేర్ ల వినియోగం
తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కొంత మంది అక్రమార్కులు అధునాతన బాట్లు, ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లు, ప్రత్యేక బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ లపై ఆధారపడుతున్నారు. లాగిన్ ఆధారాలు, రైలు సమాచారం, ప్రయాణీకుల పేర్లు, చెల్లింపు వివరాల వరకు అన్ని వివరాలను ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో పూరించడానికి ఈ సాధనాలు వినియోగిస్తున్నారు. మెరుపు వేగంతో ఈ బాట్ లు తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నాయి. నిజమైన ప్రయాణీకులకు తత్కాల్ టికెట్లు దొరకకుండా చేస్తున్నాయి. అంతేకాదు, ఈ తత్కాల్ టికెట్ రాకెట్ లో కొందరు ఈ బాట్లను విక్రయించే వెబ్ సైట్లను కూడా నడుపుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ సాధనాల ధర రూ.999 నుంచి రూ. 5,000 వరకు పలుకుతుంది. ట్రోజన్ అనే మాల్వేర్ వినియోగదారు సమాచారాన్ని రహస్యంగా దొంగిలించడానికి రూపొందించబడిన ఒక రకమైన హానికరమైన సాఫ్ట్వేర్ గా గుర్తించారు. ఇది తెలియకుండా దాన్ని డౌన్ లోడ్ చేసుకునే ఎవరైనా తమ వివరాలను సైబర్ కేటుగాళ్లకు అప్పగించినట్లు అవుతుంది.
నిజమైన ప్రయాణికులపై తీవ్ర ప్రభావం
నిజమైన ప్రయాణికులపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యే కీలకమైన తొలి ఐదు నిమిషాలలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అన్ని లాగిన్ లలో ఆటోమేటెడ్ బాట్ ట్రాఫిక్ 50% వరకు ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ కనుగొంది. ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ల ద్వారానే ఈ టికెట్లు కొల్లగొట్టబడుతున్నట్లు వెల్లడైంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు IRCTC 2.5 కోట్లకు పైగా నకిలీ యూజర్ ఐడీలను గుర్తించి సస్పెండ్ చేసింది. అంతేకాదు, తత్కాల్ టికెట్ల బుకింగ్ కు సంబంధించి తొలి 30 నిమిషాలలో రైల్వే ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా నిరోధిస్తోంది.
Read Also: రైలు వెళ్తుంటే సరదాగా కూడా ఆ పని చెయ్యకండి, కుర్రాళ్లూ మీకే ఈ హెచ్చరిక!