Nizamabad Collector: నిజామాబాద్ జిల్లాలో అవినీతి తిమింగలాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సింహస్వప్నంగా మారారు. రికార్డులు ట్యాంపరింగ్ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పహానీల్లో అక్రమ మార్పులు చేసిన నార్త్ తహసీల్దార్ రికార్డ్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు వేశారు. అటు బోధన్లో అడ్మిషన్ రికార్డుల మాయంపై హెడ్మాస్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లాలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదంటున్నారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్వయంగా విచారణ చేపట్టిన కలెక్టర్ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ రాహుల్ను సస్పెండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ పరిధిలోని 291/ఏ, 291/ఏఏ, 292 సర్వే నంబర్లకు సంబంధించిన పహానీ రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను ఇష్టారాజ్యంగా తారుమారు చేసినట్లు విచారణలో స్పష్టంగా తేలింది. విధి నిర్వహణలో తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతోనే రికార్డ్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ స్కామ్ ఇంతటితో ఆగడం లేదు.. ఇదే వ్యవహారంలో మరికొంత మంది ఉన్నతాధికారుల పాత్రపై కూడా విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అక్రమాలకు పాల్పడిన వారెవరైనా… వెనుక ఎంతటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా… కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!
ఇదిలా ఉండగా బోధన్ రాకాసిపేటలో విద్యార్థుల అడ్మిషన్ రికార్డులు మిస్సింగ్ కావడం మరో సంచలనంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ రికార్డులు మాయం కావడంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని, అక్రమాలను వెలికితీసి.. ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన బిగ్ టీవీ యాజమాన్యానికి, రిపోర్టర్లకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Storey By: Appa rao Big Tv
Also read: TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!