ఏడు కొండల వాడా వెంకటేశా..! ఎంత పని చేశావు తిరుమలేశా..! అని ఇప్పుడు మోడీ గురించి పాడుకోవాల్సి వస్తుంది. మోడీ సర్.. సర్తో ఎంత పెద్ద చిక్కు తెచ్చిపెట్టాడో తెలుసా? అదిప్పుడు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. ఓటు హక్కును కాపాడటం, జనానికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.
కానీ ఇక్కడ ఈ సర్తో పరిస్థితి రివర్స్ అయ్యింది. ఓటు హక్కు కావాలా? అయితే త్వరపడండి. ఆలసించినా ఆశాభంగం. ఈసారి ఛాన్స్ మిస్సయ్యిందా? గోవిందా? మీకు ఓటే కాదు.. పథకాలు ఉండవు..! మీరు అసలు భారతీయ పౌరులే కాదు..! అని కేంద్రం బెదిరించి, వేధించి, వేదనకు గురి చేసి.. ఆందోళనతో బిక్కు బిక్కు మనేలా చేసి.. ఓటు హక్కు కోసం పడరాని పాట్లు పడేలా సమయం కేటాయించి….! ఎంత పనిచేశావు మోడీ సర్.. మీ సర్తో మా సర్వస్వం పోయేలా చేశావు కదా..!అని తిట్టుకునే పాటొకటి పాడుకునేలా చేశాడు.
ఎన్యుమరేట్ ఫామ్లు దొరకడమే ఓ అదృష్టంగా మారాయి. ఇంకొన్ని రోజులైతే ఆ ఫారాలకింత అని అమ్ముకుంటారు కావొచ్చు. బీఎల్వోలు దొరుకుమన్నా దొరకడం లేదు. ఏ సందులలో దాక్కుంటున్నారో! ఫామ్లు ఇచ్చి వీటిని జిరాక్స్ చేసుకోండి.. మళ్లా మళ్లా ఇవ్వబడవు. ఒక్క అక్షరం తప్పుబడినా అంతే సంగతులు. సరేనా? అని బెదిరించినంత పనిచేస్తున్నారు ఆ బిఎల్వోలు.
ఇక మన పార్టీ నేతలు.. ఈ సర్ మొదలు కాకముందు, అవగాహన , శిక్షణ, బీఎల్వోలల ఏర్పాటు అని హడావుడి చేశారా? ఇప్పుడు ఫీల్డులో ఒక్కరంటే ఒక్కరు కనిపించడం లేదు. అటు కేంద్రం ఓటు హక్కుపై కత్తి వేలాడదీస్తుంటే.. ఇటు పాలకుడు పట్టించుకోకుంటే.. అటు ప్రతిపక్ష నేత ఫామ్హౌజ్లో సేదతీరి.. టైం పాస్ చేస్తుంటే.. ! జనం ఆగమయి గల్లీల్లో ఆ ఫామ్లు పట్టుకుని, ముఖాన క్వశ్చన్ మార్కు తగిలించుకుని, పిచ్చిపట్టినట్టు దిక్కులు చూస్తూ.. ఓటు హక్కు ఉంటుందా? ఊడుతుందా? అని బిక్కు బిక్కుమని దీనంగా ఉన్నాడు.
ఇదీ ఇప్పుడు స్టేట్లో సర్ పరిస్థితి. మరీ ఇంత అధ్వాన్నమా? సరే బోగస్ కోసం ఈ సర్ పెట్టారనుకుందాం. దీనికోసం అవసరమైన యంత్రాంగం.. జనానికి విడమర్చి వివరించి.. దగ్గరుండి.. అన్నీ చేసి.. ఫామ్లు నింపి..తీసుకుని వాటిని సబ్మిట్ చేసి.. మళ్లీ జాబితాలో ఓటు వచ్చిందీ లేనిది వివరించి.. రాకపోతే మళ్లీ మార్పులు చేసి.. ఒక్కసారి కాకపోదే పదుల సార్లు ఆ ఇంటికి పోయి.. ఆ కుటుంబాన్ని కలిసి…..! ఇవన్నీ చేయాలె కదా? ఇందులో ఒక్కటి కూడా చేయని కేంద్ర సర్కార్, స్టేట్ సర్కార్ ఉండెందుకు? ఇది నేనడం లేదు. జనాలు తిడుతున్నారు.
అంతలా విసిగిపోయారు. దీనికి తోడు వాట్సాప్లలో, సోషల్ మీడియాలో ఈ సర్ భూతంపై రోజుకో కొత్త పుకారు… కొంగొత్త వార్తలు.. అవన్నీ చూస్తుంటే.. ఇక్కడి పరిస్థితులను బట్టి.. ఓటు హక్కు సాధించడమంటే.. మామూలు విషయం కాదని తేలిపోయింది. అది మామూలు మనిషితో అయ్యే పనే కాదని కూడా అర్థమైంది. మరి బీజేపీ నేతలను పట్టుకుంటే పని సులువుగా అవుతుందా? అని అడిగే వాళ్లూ తయారయ్యారు అంటే.. దీని అర్థమేమిటీ పరమేశా? అదే మోడీ సర్..! సర్.. సర్.. ! ఈ సర్ అనాలంటేనే ఇక భయపడే రోజులైతే దాపురించాయిపుడు కాదంటారా సర్!