Advertisement Policy: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అడ్వర్ టైజ్ మెంట్లకు సంబంధించిన సర్కారు ఇటీవల కొత్త మార్గదర్శకాలతో జారీ చేసిన జీవో నెంబర్ 84లో సవరణలు చేస్తూ తాజాగా మరోసారి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ లో విలీనమైన ప్రాంతాల్లో అడ్వర్ టైజ్ మెంట్ల దందా నిబంధనలకు విరుద్దంగా ఇష్టారాజ్యంగా జరుగుతుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు సర్కారు ఇటీవలే సరి కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీని తీసుకువచ్చింది. కానీ ఈ పాలసీలో ఔట్ డోర్ అడ్వర్ టైజ్ మెంట్ ప్రస్తావన లేకపోయినా, తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ఔట్ డోర్ అడ్వర్ టైజ్ మెంట్ ల ఏర్పాటు, నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది.
ఇదివరకే జారీ చేసిన కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీలో కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అడ్వర్ టైజ్ మెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సర్కారు తాజాగా జారీ చేసిన నిబంధనల్లో కమర్షియల్, ప్రైవేటు భవనాలపై ఏర్పాటు చేయనున్న రూప్ టాప్ అడ్వర్ టైజ్ మెంట్లకు సంబంధించి కూడా పలు ఆంక్షలను అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేవలం కమర్షియల్ బిల్డింగ్ లపైనే వీటిని అనుమతించనున్నట్లు, వీటిని కూడా జీప్లస్ నాలుగు అంతస్తుల భవనాలపై అనుమతించేది లేదని సవరణల్లో సర్కారు పేర్కొంది. రూప్ టాప్ అడ్వర్ టైజ్ మెంట్లను 60, 80, వంద అడుగుల వెడల్పు ఉన్న రోడ్ల పక్కన భవనాల్లో మాత్రమే అనుతించనున్నట్లు వెల్లడించింది. రూప్ టాప్ అడ్వర్ టైజ్ మెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రెసిడెన్షియల్ భవనాలపై అనుమతించేది లేదని, అక్రమంగా ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తప్పవని కూడా సర్కారు హెచ్చరించింది.
ఈ రకంగా ఏర్పాటు చేసే అడ్వర్ టైజ్ మెంట్లను హైడ్రాతో సమన్వయం చేసుకుని తొలగించనున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎక్కడా అడ్వర్ టైజ్ మెంట్లను ఏర్పాటు చేసినా, ట్రాఫిక్ సేఫ్టీ ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ అనుమతించనున్నట్లు వెల్లడించింది. యూనిపోల్స్ లను కూడా ప్రైవేటు ప్లేస్లలో, కమర్షియల్ ఏరియాల్లో మాత్రమే అనుమతించనున్నట్లు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వీటిని కూడా సాంకేతికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని, సేఫ్టీ ప్రమాణాలు, అడ్వర్ టైజ్ మెంట్ ఫీజు, క్యూఆర్ కోడ్, వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టే మెకానిజం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అనుమతించనున్నట్లు తెలిపింది. వీటిని ఎప్పటికపుడు అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్సీ) పర్యవేక్షిస్తుందని సవరణల్లో పేర్కొంది.
Also read: హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు
గరిష్టంగా ఈ అడ్వర్ టైజ్ మెంట్ల కాలం అయిదేళ్లుగా నిర్ణయించినట్లు సర్కారు సవరణల్లో పేర్కొంది. రూప్ టాప్ అడ్వర్ టైజ్ మెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రెసిడెన్షియల్ భవనాలు, హెరిటెజ్ భవనాలు, మతపరమైన కట్టడాలు, స్కూల్స్, ఇతర విద్యా సంస్థలు, హాస్పిటల్స్తో పాటు సర్కారు అడ్వర్ టైజ్ మెంట్లను నిషేధించిన ప్రాంతాల్లోని భవనాలపై కూడా వీటిని అనుమతించేది లేదని తెల్చి చెప్పింది. రూప్ టాప్ అడ్వర్ టైజ్ మెంట్లు ట్రాఫిక్ సిగ్నల్స్కు, ఫ్లై ఓవర్కు చేరుకునే రూట్లో, పాదచారుల రూట్, ఎమర్జెన్సీ కోసం వినియోగంచే ప్యాసెజీల్లో, రోడ్ సైనేజీలపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఏర్పాటు చేయాలని సూచించింది.
రూప్ టాప్ అడ్వర్ టైజ్ మెంట్లకు మూడు రకాల సైజులను సర్కారు ఖరారు చేసింది. 30 ఫీట్లు అడ్డం, మరో 30 ఫీట్లు వెడల్పు, 40 ఫీట్లు అడ్డం, మరో 25 ఫీట్లు వెడల్పు, 40 ఫీట్లు అడ్డం, మరో 20 ఫీట్లు వెడల్పుతో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలని సర్కారు తెలిపింది. గరిష్టంగా డిస్ ప్లే వెయ్యి చదరపు ఫీట్లకు మించుకుండా ఉండాలని సూచించింది. ఈ అడ్వర్ టైజ్ మెంట్లు న్యాచురల్ లైట్, వెంటిలేషన్, ఫైర్ క్లియరెన్స్ తో పాటు పొరుగు భవనాల సెట్ బ్యాక్ లకు ఎలాంటి ఆటంకం గానీ, అంతరాయం కల్గినట్లు ఏర్పాటు చేయొద్దని సూచించింది. వీటిని ఏర్పాటు చేసేందుకు వినియోగించే మెటీరియల్ కు కూడా ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది.
Also read: ట్రంప్, పుతిన్ వచ్చినా అంతే బాసూ.. నాని ట్వీట్లపై చిన్ని పంచ్!
ఇందుకు వినియోగించే స్టీల్ ఐఎస్ఐ సర్టిఫికెట్ కల్గిన కంపెనీకి మాత్రమే వినియోగించాలని, తప్పు పట్టకుండా యాంటీ రస్ట్ కోటింగ్ మస్టుగా ఉండేలా చూసుకోవాలని, వెదర్ రెసిస్టెంట్ కోటింగ్ ఉన్న మెటీరియల్ మాత్రమే వినియోగించాలని సూచించింది. వీటి ఏర్పాటు కూడా భవన యజమాని నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని, సదరు అడ్వర్ టైజ్ మెంట్ కు ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యేలా ఉండాలని సూచించింది. వీటిలో ఫ్లాషింగ్ లైట్లు, ఎక్కువ వెలుగులు వచ్చే డిస్ ప్లే వంటివి అనుమతించేది లేదని సర్కారు తేల్చి చెప్పింది.
నగరంలో వివిధ పండుగలు, రాజకీయ నాయకుల బర్త్ డేలు, ఇతర ఉత్సవాలు నిర్వహించినపుడు ఏర్పాటు చేయనున్న ప్లెక్సీలు వంటి అడ్వర్ టైజ్ మెంట్ మెటీరియల్ ఏర్పాటు చేయాలన్నా, క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని సర్కారు స్పష్టం చేసింది. వీటిని కొత్తగా తీసుకువచ్చిన అడ్వర్ టైజ్ మెంట్ పాలసీలో క్యాటగిరీ 5 లో పరిగణించనున్నట్లు తెలిపింది. మూవింగ్ కంటెంట్ కల్గిన అడ్వర్ టైజ్ మెంట్లను జంక్షన్లు, ఫ్లై ఓవర్లు, భారీ ట్రాఫిక్ కారిడార్, ట్రాఫిక్ సిగ్నల్ జోన్లలో అనుమతించేది లేదని కూడా సవరణల్లో పేర్కొంది.
Also read: ఎలక్ట్రికల్ బస్సుల వెనుక అసలు కథ ఇదేనా..? ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ సంచలనం!